ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పాలనా పరంగా సరైన దిశగా నడిపించడంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఏనాడూ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని.. దానికి నిరసనగానే ఈరోజు సభలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజునే అనూహ్యంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని తెలిపింది. సభలో ఈరోజు గవర్నర్ ప్రసంగం ఆరంభం అయ్యాక.. ఒక్కసారిగా టీడీపీ సభ్యులు పైకిలేచి గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవైపు వీరి నిరసన, నినాదాలు చేస్తుండగా గవర్నర్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పోయారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు వెల్లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించి పోడియం పైకి విసిరేశారు.
ఈ తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య దాదాపు 20 నిమిషాలు గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగింది. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో పాలనాపరంగా గాడి తప్పిందని.. దీనిపై ఎన్నోసార్లు గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వెల్లడించారు. అన్యాయంగా సీఆర్డీఏ చట్టం రద్దుచేశారని.. అయినా మూడు రాజధానులు బిల్లుపై గవర్నర్ సంతకం చేశారని తెలిపారు. వీటిపై అనేకసార్లు గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇస్తే ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు. అందుకే.. ఆ ఆవేదనతోనే ఈరోజు గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన వ్యక్తం చేశామన్నారు అచ్చెన్నాయుడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ