భారీ వర్షం కారణంగా నవంబరు 18 నుండి 30వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరో సమయంలో తిరిగి దర్శనం, బస కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో దర్శనం, గదులు బుక్ చేసుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపొందించి 6 నెలల్లోపు తిరిగి స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడుతున్నామని, సర్వదర్శనం, రూ.300 దర్శనం, వర్చువల్ సేవలు, శ్రీవాణి ట్రస్టు భక్తులకు ఇది వర్తిస్తుందని తెలిపారు.
ముందుగా తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ నవంబరు 18వ తేదీ నుండి దర్శన టికెట్లు ఉన్న భక్తులు నవంబరు 30వ తేదీలోపు తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించి లడ్డూ ప్రసాదాలు అందజేస్తామన్నారు. దర్శన టికెట్లు ఉండి నవంబరు 30వ తేదీ తరువాత దర్శనానికి రాదలిచిన భక్తులు సాఫ్ట్వేర్ అప్లికేషన్లో 6 నెలల్లోపు తిరిగి దర్శన స్లాట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తిరుమలలో అధిక వర్షపాతం నమోదైనా ఒకటి, రెండు ప్రదేశాలు మినహా పెద్దగా నష్టం వాటిళ్లలేదని, తిరుమల చక్కగా ఉందని, భక్తులు నిర్భయంగా వచ్చి స్వామివారి దర్శించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్డలో 13 చోట్ల వర్షానికి భూమి నాని వదులుకావడంతో రక్షణ గోడలు జారి రోడ్డుకు అడ్డంగా పడ్డాయని, పలు చోట్ల చెట్ల కూలాయని, వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన తొలగించామని, ప్రస్తుతం ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. తిరుమల నుండి తిరుమలకు వెళ్లే రోడ్డులోనూ ఎలాంటి సమస్య లేదన్నారు. ఈ రెండు ఘాట్ రోడ్లలో నాలుగు రోజుల నుండి వాహనాలు చక్కగా ప్రయాణిస్తున్నాయని, భక్తులు నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రావచ్చని తెలియజేశారు.
అలిపిరి మార్గంలోని నడకదారి చక్కగా ఉందని, భక్తులు నడిచి తిరుమలకు వెళ్లవచ్చని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలో నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. సామర్థ్యానికి మించి వర్షపు నీరు రావడం, నీటిప్రవాహంతోపాటు బండరాళ్లు వేగంగా వచ్చి ఢీకొనడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. కల్వర్టుల వద్దకు వాహనాలు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని, వీటి పునర్నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మనుషులే తీసుకువెళ్లాల్సి రావడంతో ఆలస్యమవుతోందని చెప్పారు. భక్తులు నడించేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, అంతవరకు ఈ మార్గం మూసి ఉంటుందని అన్నారు.
నవంబరు 25 నుండి 28వ తేదీ వరకు తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచించారని, ఈ మేరకు పరిస్థితిని ఎదుర్కొనేందుకు టీటీడీలోని ఇంజినీరింగ్, అటవీ, ఆరోగ్య, భద్రత తదితర అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఇందుకు అవసరమైన జెసిబిలు, హిటాచీలు, ట్రక్కులు, చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. బసకు సంబంధించి తిరుమల నారాయణగిరి విశ్రాంతి గృహంలో రెండు గదులు మాత్రమే దెబ్బతిన్నాయని, మిగతా చోట్ల 7 వేల గదుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఐటి విభాగం అధికారులు ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వర్షానికి సర్వర్లు డౌన్ అవకుండా తగిన మౌలిక వసతులు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అన్నదానం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్లో ఎలాంటి ఇబ్బందు లేవని, భక్తులు నిస్సంకోచంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని ఎవి.ధర్మారెడ్డి తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ