ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల దిశగా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సీట్ల ఖరారుపై ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కీలకమైన నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య పోటీ మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల కోసం పోటీ పెరిగింది. అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. దీంతో పోటీలో నిలిచే అభ్యర్థులపైన ఆసక్తి కొనసాగుతోంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. ఈ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బోండా ఉమా టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా 51,578 ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధా ప్రస్తుతం సెంట్రల్ నుంచే పోటీకి ఆసక్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. సెంట్రల్ నుంచి బోండా ఉమా, వంగవీటి రాధా మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ టీడీపీలోనే ఉండటంతో ఎవరికి సీటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. రాధాకు ఎమ్మెల్సీ..బోండా ఉమాకు ఎమ్మెల్యేగా సీటు ఖరారు చేస్తారని మద్దతు దారుల్లో ప్రచారం సాగుతోంది.
బోండా ఉమా గత ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి టీడీపీ నుంచి తిరిగి పోటీకి సిద్ధం అవుతున్నారు. టీడీసీ స్ట్రాటిజీ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో వంగవీటి రాధా చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ను కలిశారు. ఆ సమయంలో సెంట్రల్ సీటు గురించి చర్చ జరిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు ఖరారైందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో సెంట్రల్లో బోండా ఉమాతో కలిసి కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వంగవీటి రాధా ఎన్నికల్లో పోటీ చేస్తారా..? లేక ప్రచారానికే పరిమతం అవుతారా..? అనేది తేలాల్సి ఉంది. రాధా రాజకీయ నిర్ణయం సెంట్రల్లో కీలకం కానుంది. పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో వంగవీటి అభిమానులు ఉన్నారు. జనసేన, టీడీపీ పొత్తు ఇక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇదే సమయంలో అధికార వైసీపీ సిట్టింగ్ స్థానంలో వ్యూహాత్మక నిర్ణయాలతో సిద్ధం అవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల వరకు కాపు, మరో 30 వేల తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. 20 వేల వరకు బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఉండగా, మల్లాది విష్ణు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు 28 వేల యాదవ వర్గ ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించుకుతుందనే అభిప్రాయం ఉంది. మరోవైపు ఈ సీటు టీడీపీ, జనసేన పొత్తులో కీలక సీటుగా ఉండనుంది. అటు రాధా.. ఇటు బోండా ఉమా ఇద్దరూ సెంట్రల్ సీటు పైన ఆశలు పెట్టుకోవటంతో..ఈ సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE