ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరు ‘‘సిద్ధం’’ అంటే.. మరొకరు ‘‘యుద్దం’’ అంటున్నారు. త్వరలోనే ఎన్నికల సమరం ఉండడంతో ఒకరి బండారం.. మరొకరు బయటపెట్టుకుంటున్నారు. విపక్షాలన్నీ ఇప్పుడు అధికార పక్షాన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి.. ఏం అమలు చేశారు.. ప్రధానంగా ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి.. అనే అంశాల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ పై ఉన్న కేసులు.., కేంద్రంతో ఉన్న సంబంధాలను బయటపెట్టే పనిలో ఉన్నాయి. వ్యక్తిగత అవసరాల రీత్యా రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్ర పెద్దలను జగన్ గట్టిగా అడిగే పరిస్థితి లేదని ప్రచారం చేస్తున్నాయి.
తనపై ఉన్న కేసుల నుంచి గట్టెక్కేందుకు బీజేపీతో సత్సంబంధాలను జగన్ కొనసాగిస్తున్నారన్న అంశం ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ప్రధానంగా జగన్ టార్గెట్ గానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఫల్యాలనే సాధనంగా తీసుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ప్రధానంగా 2019లో ప్రత్యేక హోదా హామీతోనే ఆయన అధికారంలోకి వచ్చారని.. ఈ ఐదేళ్లలో అది సాధించకపోగా.. కనీసం హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని నోరుతెరిచి అడుగలేదని కాంగ్రెస్ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఢిల్లీలో సైతం ఆందోళన చేపట్టారు. ఆ సందర్భంగా ప్రత్యేక హోదా కు మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీల నేతలను కూడా షర్మిల కలిశారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులతో ఆమె హస్తినలో ఓ రోజంతా మకాం వేశారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రసంగాలు, దీక్షల వివరాలను రాష్ట్ర ప్రజలకు షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. జగన్ మాటలను విశ్వసించి వైసీపీకి భారీ విజయాన్ని అందిస్తే.. ప్రజలకు నమ్మక ద్రోహం చేశారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బీజేపీతో జగన్ సంబంధాలను ప్రజలకు వివరించేందుకు షర్మిల ప్రత్యేక సభల నిర్వహణకు సిద్ధం అవున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా, తర్వాత గన్నవరం, విశాఖల్లో కూడా బహిరంగ సభలు చేపట్టాలని షర్మిల యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ పథకాలను ప్రజలు విశ్వసించారని.. ఆంధ్రలోనూ ఇదే ఫార్ములాను అమలు చేయాలని ఆమె, అధిష్ఠానం ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, జేడీ శీలం సహా 17 మంది సభ్యులు హాజరయ్యారు. వచ్చే నెల పదో తేదీన బెంగళూరులో విస్తృత చర్చల అనంతరం మేనిఫెస్టో తయారవుతుందని కొప్పుల రాజు చెప్పారు.
2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందనే అంశాన్ని ప్రధానంగా ఈ ఎన్నికల్లో లేవనెత్తాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంటులో విభజిత ఆంధ్రకు ప్రత్యేక హోదా సహా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన షర్మిల.. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రయత్నాలు చేయకపోవడం వెనుక ఉన్న రహస్య సంబంధాలను తెలియజేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా అమలు, జీవనాడి పోలవరం నిర్మాణంతో పాటు అసంపూర్తిగా వదిలేసిన హామీలను ఏపీ ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడానికి కారణం బీజేపీతో సత్సంబంధాలే అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. పైకి పోరాడుతున్నట్లు నాటకం ఆడుతున్నారని అంశాన్ని హైలెట్ చేస్తూ.. రానున్న ఎన్నికల ప్రచారం జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE