ఆసియా కప్లో టీమిండియా బోణీ చేసింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక చివరి ఓవర్ వరకు ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నట్లు కనిపించిన ఈ మ్యాచ్ ఇరు దేశాల అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. ఐతే చివరి ఓవర్లో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్సర్తో భారత్కు విజయం అందించాడు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (4/26), హార్దిక్ పాండ్యా (3/25) రాణించారు. యువ పేసర్లు అర్ష్దీప్ రెండు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. పాక్ తరపున ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇఫ్తికార్ అహ్మద్ (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ బాబర్ ఆజం సహా మిగతా బాటర్లు చేతులెతేశారు.
అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు.. ఓపెనర్ల నుంచి సరైన ఆరంభం లభించలేదు. కేఎల్ రాహుల్ డకౌట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్లో 3 ఫోర్లతో 14 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో జడేజా అవుట్ అయినా వెరవకుండా నాలుగో బంతికి సిక్సర్ బాడీ భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లో ఆల్ రౌండ్ షో కనబర్చిన పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక భారత్ తన తదుపరి పోరులో బుధవారం పసికూన హాంకాంగ్తో తలపడనుంది.
ఈ మ్యాచ్ ద్వారా భారత ఆటగాళ్లు సాధించిన పలు ఘనతలు..
- భారత్ తరఫున 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి ప్లేయర్గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. అలాగే మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టీ20)లలో వంద మ్యాచ్లాడిన తొలి భారత ఆటగాడిగా కూడా విరాట్ నిలిచాడు.
- అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3,499) సాధించిన బ్యాటర్గా రోహిత్ శర్మ, న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ (3,497)ను అధిగమించాడు.
- అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో పదికి పది వికెట్లను పేసర్లే పడగొట్టడం టీమిండియాకు ఇదే తొలిసారి.
స్కోరు బోర్డు
పాకిస్థాన్: రిజ్వాన్ (సి) అవేశ్ (బి) హార్దిక్ 43, బాబర్ ఆజమ్ (సి) అర్ష్దీప్ (బి) భువనేశ్వర్ 10, ఫఖర్ జమాన్ (సి) దినేశ్ (బి) అవేశ్ 10, ఇఫ్తికార్ అహ్మద్ (సి) దినేశ్ (బి) హార్దిక్ 28, ఖుష్దిల్ షా (సి) జడేజా (బి) హార్దిక్ 2, షాబాద్ (ఎల్బీ) భువనేశ్వర్ 10, ఆసిఫ్ అలీ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 9, మహ్మద్ నవాజ్ (సి) దినేశ్ (బి) అర్ష్దీప్ 1, హారిస్ రౌఫ్ (నాటౌట్) 13, నసీమ్ షా (ఎల్బీ) భువనేశ్వర్ 0, షానవాజ్ దహాని (బి) అర్ష్దీప్ 16, ఎక్స్ట్రాలు: 5; మొత్తం: 19.5 ఓవర్లలో 147 ఆలౌట్
భారత్: రోహిత్ (సి) ఇఫ్తికార్ (బి) నవాజ్ 12, కేఎల్ రాహుల్ (బి) నసీమ్ 0, విరాట్ కోహ్లీ (సి) ఇఫ్తికార్ (బి) నవాజ్ 35, జడేజా (బి) నవాజ్ 35, సూర్యకుమార్ (బి) నసీమ్ 18, హార్దిక్ పాండ్యా (నాటౌట్) 33, దినేశ్ కార్తీక్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 19.4 ఓవర్లలో 148/5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY