ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు శనివారం వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో ఆదివారం న్యూజిలాండ్తో జరుగనున్న మూడో వన్డే అతనికి ఆఖరి మ్యాచ్ కానున్నది. అయితే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా టీ20 జట్టుకు మాత్రం ఫించ్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక గతేడాది ఫించ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పటివరకు 145 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన ఫించ్ అందులో 54 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే వన్డేల్లో 5400 పరుగులు చేసిన ఫించ్ ఇటీవల సరైన ఫామ్లో లేకపోవడం అతనిపై ఒత్తిడి పెంచింది. మరీ ముఖ్యంగా గత 12 ఇన్నింగ్స్లో అయిదు డక్ అవుట్లు సహా కేవలం 169 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే మొత్తం వన్డే కెరీర్లో 17 సెంచరీలు సాధించాడు. అతని కంటే ముందు రికీ పాంటింగ్ (29 సెంచరీలు), డేవిడ్ వార్నర్, మార్క్ వాలు (18 సెంచరీలు) ఉన్నారు.
ఈ సందర్భంగా ఆరోన్ ఫించ్ తన రిటైర్మెంట్కు సంబంధించి ఒక ప్రకటనలో ఇలా తెలిపాడు. ‘ఇది కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో సాగిన ప్రయాణం. ఈ ప్రయాణంలో నేను కొన్ని అద్భుతమైన వన్డే జట్లలో భాగమైనందుకు చాలా అదృష్టవంతుడిని. నేను ఆడిన వారందరితో కలిసి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక ఆరోన్ ఫించ్ తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా వన్డే జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ కెప్టెన్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లలో ఎవరో ఒకరు జట్టు పగ్గాలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే నెలలో టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాలోనే జరగనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహిస్తుండటం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ