తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాలలో పర్యటించి గణేష్ నిమజ్జనాన్ని మంత్రి తలసాని పర్యవేక్షించారు. ముందుగా ఖైరతాబాద్ గణేష్ మండపానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బాలాపూర్ గణేష్ మండపం వద్దకు చేరుకొని లడ్డు వేలం పాటను తిలకించారు. అక్కడి నుండి చార్మినార్, మోజంజాహి మార్కెట్ వద్దకు చేరుకొని నిమజ్జనానికి వెళుతున్న వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. తదనంతరం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని హుస్సేన్ సాగర్ లో మేయర్ విజయలక్ష్మితో కలిసి బోట్ లో తిరుగుతూ గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించినట్లు వివరించారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణనాధుడు అని, ఆయనను దర్శించుకొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్వాహకులను అయోమయానికి గురిచేసేలా కొందరు ఏర్పాట్లపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. 2014 కు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయలేదని అన్నారు. ప్రజలు, నిర్వాహకులు ఎంతో గొప్పగా వినాయక నవరాత్రులను భక్తీ శ్రద్దలతో నిర్వహించుకున్నారని చెప్పారు. శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేజీ లను ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో త్రాగునీటిని అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు.
ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనం పరిశీలన:
నగరంలో జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లతో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ట్యాంక్ బండ్, చార్మినార్ తదితర ప్రాంతాలలో నిమజ్జనాన్ని పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY