ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్కు భారీ ఊరట లభించింది. ఆమెతో పాటు భర్త దీపక్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా వారి అరెస్ట్పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొచ్చర్ల అరెస్టులు చట్టానికి అనుగుణంగా జరగలేదని అభిప్రాయపడిన ధర్మాసనం అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అవసరమైన అనుమతులను పొందలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిద్దరూ జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదల కాబోతున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో వీరిని సీబీఐ గత డిసెంబరు 23న వీరిద్దరినీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం కొచ్చర్ల బెయిల్ పిటీషన్పై విచారణ సందర్భంగా వారి తరపున న్యాయవాదులు పలు అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్లు సీబీఐ సమన్లు జారీ చేసినపుడు దర్యాప్తునకు వీరు హాజరయ్యారని, విచారణకు పూర్తిగా సహకరించారని, అలాంటప్పుడు వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇక మహిళలను అరెస్ట్ చేసేటపుడు మహిళా అధికారి ఉండాలని చట్టంలో స్పష్టం ఉందని, అయితే చందా కొచ్చర్ను అరెస్ట్ చేసేటపుడు అధికారులు ఈ నిబంధన పాటించలేదని తెలిపారు. వీరి వాదనలను సమ్మతించిన న్యాయస్థానం వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కొచ్చర్లు ఇద్దరూ చెరొక రూ.1 లక్ష నగదు పూచీకత్తు సమర్పించాలని, అలాగే ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది జామీనుదారుల హామీ చూపించాలని ఆదేశించింది. ఇంకా వారు తమ పాస్పోర్టులను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని కూడా ఈ దంపతులకు సూచించింది. జస్టిస్ రేవతి మొహితే డెరే, జస్టిస్ పీకే చవన్ డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE