దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో కరోనావైరస్ మరింత ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. వారి పరిధిలో నగరాల్లో, పట్టణాలలో ఇంటింటి సర్వే నిర్వహించడం, పరీక్షలు చేయడం, వైరస్ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది.
తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజ్ ల ప్రిన్సిపల్స్తో జూన్ 8, సోమవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కంటైన్మెంట్ జోన్లలో పాటించాల్సిన వ్యూహాలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు కల్గిన వారిపై దృష్టి సారించి కరోనా మరణాలు తగ్గించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనల సడలింపులిచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu