భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ (63) దుర్మరణం పాలయ్యారు. నిన్న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన అసువులు బాసారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ తోపాటు మరో 11 మంది కూడా ఈ ప్రమాదంలో మరణించారు. 14 మంది ప్రయాణం చేస్తున్న ఈ ఛాపర్ లో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సైన్యం ఉపయోగించే అత్యాధునికమైన ఛాపర్ ఇలా అకస్మాత్తుగా కూలిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేనివలన ఈ దుర్ఘటన జరిగిందో తెలుసుకోవటంకోసం ఆర్మీ అత్యవసర విచారణ చేపట్టింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కూడా ఈ సంఘటనపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారతదేశంలో మొట్ట మొదటి త్రివిధదళాధిపతిగా బిపిన్ రావత్ నియమితులయ్యారు. 2019 ఆగస్టు 15న ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. వచ్చే నెలలో పదవీవిరమణ చేయనున్న ఆయన ఈ ప్రమాదంలో మరణించటం బాధాకర విషయం. 1999లో కార్గిల్ వార్ తర్వాత భారత త్రివిధ దళాలను సమన్వయపరచటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పలు సూచనలు వచ్చాయి. ఈ విషయం గురించి పైస్థాయిలో సమాలోచనలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వాలు మారటం తదనంతర పరిణామాల వలన ఆ ప్రక్రియ ఆలస్యం అయింది. మోదీ ప్రధాని అయ్యాక బిపిన్ రావత్ ని త్రివిధ దళాధిపతిగా నియమించారు. దేశ రక్షణ విషయాలలో భారత్ వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోవటంలో రావత్ కీలకంగా వ్యవహరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ