కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకి చేరుకుంది. మంగళవారం నాడు 35 రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్, పరిశ్రమల సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ సమావేశంలో నూతన వ్యవసాయ చట్టాల రద్దుకే రైతు సంఘాలు పట్టుబట్టినట్టు తెలుస్తుంది. కేంద్రంతో చర్చలు తేలేంత వరకు నిరసన కొనసాగింపుకే నిర్ణయించుకున్నట్టు రైతుసంఘాలు వెల్లడించాయి. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఈరోజు ఢిల్లీ-యూపీ (ఘజిపూర్-ఘజియాబాద్) సరిహద్దు వద్ద పోలీసు బారికేడ్లను తొలిగించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్-ఢిల్లీని కలిపే కీలక రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు మూసివేశారు.
అలాగే నోయిడా నుంచి ఢిల్లీకి వచ్చే ప్రజలకు చిల్లా మార్గాన్ని ఉపయోగించకుండా, డిఎన్డి లేదా కలిండి కుంజ్ మార్గంలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇవే గాకా రైతుల నిరసనతో ఢిల్లీకి వచ్చే అనేక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు గురువారం నాడు రైతులతో కేంద్రప్రభుత్వం మరోసారి చర్చించనుంది. చర్చల్లో భాగంగా రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని కేంద్రమంత్రులు కోరారు. అలాగే చర్చలకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరవుతుండంతో ఏకాభిప్రాయం కుదరడం లేదని, కొంతమందితో ఒక కమిటీగా ఏర్పడి రావాలని సూచించినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ