ఏ కుటుంబమైతే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఆర్థికంగా సతమతం అవుతుందో దాన్నే పేదరికం అంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో కూడు, గూడు, గుడ్డ మాత్రమే కనీస అవసరాలు కావు. తిండిలో పోషకాలు ఉంటున్నాయా, ఆ గూడు ఉండేందుకు ఆమోదయోగ్యమైన స్థాయిలోనే ఉందా, కేవలం కప్పుకోవడానికి మాత్రమే కాకుండా.. ఆ వస్త్రాలంకరణ ఆత్మగౌరవం చాటుకునేలా ఉందా అనేది కూడా ముఖ్యమే. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా ఆ స్థాయిలో లేని కుటుంబం ద్రారిద్యానికి దిగువన ఉన్నట్లే అని ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంచెం ఎక్కువ, తక్కువ ఉండొచ్చు కానీ.. దేశంలో దారిద్య్రం మాత్రం తొలగిపోలేదు. పేదరిక నిర్మూలన, ప్రజలకు కనీస సదుపాయాల కల్పన ధ్యేయమనే లక్ష్యాలతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నప్పటికీ.. లక్ష్యసాధనలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి.
దేశంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగినట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. తమ ప్రభుత్వం ఏర్పరిచిన పారదర్శక వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, చిత్తశుద్ధితో చేసిన కృషి ఇందుకు కారణాలుగా మోడీ పేర్కొంటున్నారు. దేశంలో పేదరికం తగ్గుతుందని ఎవరూ భావించలేదని, కానీ తమకు వనరులు కల్పిస్తే అది సాధ్యమేనని పేదలు నిరూపించారని చెప్పారు. దేశంలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్ నివేదికను ప్రధాని ప్రస్తావిస్తూ పేదలకు చేయూతనివ్వడంలో భారత్ ఇతర దేశాలకు ఓ నమూనాను అందించిందని, ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఏ ఒక్క పేద వ్యక్తి కూడా సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా లేరని మోడీ ఉద్ఘాటించారు.
దీనిపై విపక్ష పార్టీ కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది. దేశంలో తొమ్మిదేళ్లలో దాదాపు 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందన్న నీతి ఆయోగ్ తాజా నివేదిక పచ్చి అబద్ధమని విమర్శించింది. ఈ పాతిక కోట్ల మందికి సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్ను నిలిపివేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించింది. రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చెప్పే మోసపూరిత మాటల్లో ఇది కూడా ఒకటని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ వెల్లడించారు. పేదరికాన్ని అంచనా వేసేందుకు పాటించాల్సిన ప్రామాణికాలనే నీతి ఆయోగ్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ సర్వే చేసి రూపొందించిన నివేదికకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతన లేదన్నారు.
పేదరికాన్ని అంచనా వేసేందుకు పాటించాల్సిన ప్రామాణికాలనే నీతి ఆయోగ్ మార్చేసిందని కాంగ్రెస్ చేసిన ఆ విమర్శ ఆషామాషీది కాదు. నిజంగా బీజేపీ ప్రభుత్వం అటువంటి చర్యలకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. పెరిగిన ప్రజల వార్షికాదాయాన్ని బట్టి పేదరికం తగ్గిందని అనుకుంటే అది పొరపాటే. ఈ తొమ్మిదేళ్లలో తీవ్రమైన స్థాయిలో పెరిగిన ధరల కారణంగా పెరిగిన ఆదాయంతో పోల్చితే నెలసరి వ్యయమే ఎక్కువగా ఉంది. ఈ అంశాన్ని నీతి ఆయోగ్ పరిగణనలోకి తీసుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
కూడు, గూడు, గుడ్డ మాత్రమే ప్రస్తుత కాలంలో కనీస అవసరాలు కావు. తిండిలో పోషకాలు ఉంటున్నాయా, ఆ గూడు ఉండేందుకు ఆమోదయోగ్యమైన స్థాయిలోనే ఉందా, కేవలం కప్పుకోవడానికి మాత్రమే కాకుండా.. ఆత్మగౌరవం చాటుకునేలా వస్ర్తాలంకరణ ఉందా అనేది కూడా ముఖ్యమే. మోడీ చెప్పిన ఆ 25 కోట్ల మంది ప్రజలు ఈ కేటగిరీల్లో ఉన్నారా, లేదా అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే.. నిరుద్యోగిత లేదని నివేదిక పేర్కొంటున్నట్లు అధికార పార్టీ చెబుతోంది. నిజానికి నిరుద్యోగితతో పాటు అధిక ధరలు, ఆదాయంలో అసమానతలు, అరకొర వేతనాలు, తీవ్ర పేదరికంతో చాలా మంది ప్రజలు సతమతం అవుతున్నారని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE