జమ్మూ-కశ్మీర్ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ స్థానికేతరులకూ ఓటింగ్లో పాల్గొనే హక్కు కలిపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ హిర్దేష్ కుమార్ స్థానికేతరులకు ఓటుహక్కును కల్పిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో స్థానికేతరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఓటు హక్కు లభించనుంది. అలాగే జమ్మూకశ్మీరులో నివాసం ఉంటున్న వారు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్ లోని ఆర్మీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సైనికులు కూడా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనుమతించారు.
అంతేకాకుండా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ‘రెసిడెన్స్’ అనే ఆప్షన్ తప్పనిసరి కాదని, మినహాయింపు ఇస్తున్నామని ఈసీ వెల్లడించింది. ఇక జమ్ము కశ్మీర్లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటు హక్కుకు అర్హులేనని, వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ తీసుకున్న తాజా నిర్ణయంతో మరో పాతిక లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదు కానున్నారు. ఇక ఇదిలా ఉండగా సీఈవో హిర్దేశ్ కుమార్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అక్కడ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తొలుత ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కశ్మీర్-లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ సంచలన నిర్ణయం వెలువడటంతో స్థానిక పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఓటు రాజకీయాల కోసమే బీజేపీ ఈ చర్యకు దిగిందని మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు తీవ్ర విమర్శలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY