దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2021 తొలివిడత పరీక్షలు ఫిబ్రవరి 23, మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 331 నగరాల్లో ఫిబ్రవరి 23 నుండి 26 వరకు జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలు జరగనున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో రోజుకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ముందుగా 2021 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు సెషన్లలో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో ఫిబ్రవరిలో మొదటి విడతకు 6,61,761 మంది, మార్చిలో రెండో విడతకు 5,04,540, ఏప్రిల్ లో మూడో విడతకు 4,98,910, మేలో నాలుగో విడత పరీక్షలకు 5,09,972 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
అయితే నాలుగు సెషన్లలో కూడా జరిగే పరీక్షలకు అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కానవసరం లేదని ముందే పేర్కొన్నారు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ సెషన్లలో పరీక్షకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటిని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. అలాగే జేఈఈ మెయిన్-2021 పరీక్షలను తొలిసారిగా అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మరియు గుజరాతీ వంటి 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ నిర్వహించి మాస్కులు, శానిటైజర్ అందజేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉండడంతో గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంతో పాటుగా పరీక్షా కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ