ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పదకొండవ విడత నిధులు రేపు (మే 31, మంగళవారం) విడుదల కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్లమందికి పైగా రైతులకు లబ్ధికలిగేలా దాదాపు రూ.21,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. అలాగే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు.
మరోవైపు పీఎం కిసాన్ నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు ఈ-కేవైసీని కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పీఎంకిసాన్ పోర్టల్లో ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీని అందుబాటులో ఉంచారు. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలను సంప్రదించాలని రైతులకు సూచించారు.
ముందుగా ఫిబ్రవరి 24, 2019న పీఎం-కిసాన్ పథకాన్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. అప్పటినుంచి దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యొక్క పదకొండవ విడత కింద ప్రధాని మోదీ రేపు దాదాపు రూ.21,000 కోట్ల నిధులను విడుదల చేసి, 10 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున జమచేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF