భారతదేశ అత్యున్నత పదవైన ‘రాష్ట్రపతి’ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బుధవారం భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం గెజిట్ను విడుదల చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనుంది. ఎన్నికల తదనంతరం కొత్త రాష్ట్రపతి జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ‘రాష్ట్రపతి’ పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు జూన్ 29వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అనంతరం అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన జూన్ 30వ తేదీన జరుగుతుంది.
ఇక జులై 18వ తేదీన ఎన్నికలు జరుగనుండగా, జులై 21వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. అయితే ఈ ఎన్నిక సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగనుంది. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాల్లోని చట్టసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. రాష్ట్రపతి ఎన్నికలకు సాధారణంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో పోలింగ్ ఒకేరోజు జరుగుతుంది. మొత్తం 4,809 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, ఈ సభ్యులందరి మొత్తం ఓట్ల విలువ 10,86,431. వీరిలో 776 మంది ఉభయ పార్లమెంటు సభ్యులు కాగా.. 4,033 మంది రాష్ట్ర చట్టసభలకు చెందినవారు. అయితే ఇప్పటివరకూ ఇటు కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ కానీ, ఇతర విపక్షాలు కానీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ