దేశ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటల లోపు తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా ఎంపీల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం అక్షర క్రమంలో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించనున్నారు. ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము మరియు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటి చేశారు. మరికొద్ది గంటల్లో దేశ తదుపరి రాష్ట్రపతి ఎవరో అధికారికంగా వెల్లడి కానుంది. ముందుగా దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో పాటుగా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మరియు శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం జులై 19లోగా అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంటు భవనానికి చేర్చి భద్రపరిచారు.
ఈ రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో 719 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 728 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పీసీ మోదీ తెలిపారు. ఇక ఎలక్టోరల్ కాలేజీ జాబితాలోని మొత్తం 4796 మంది ఓటర్లలో, 99 శాతం పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు తదుపరి దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. ఎన్డీఏ పక్షాల ఓట్లతో పాటుగా ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, ఏపీలోని వైఎస్సార్సీపీ, టీడీపీ, మహారాష్ట్రలోని శివసేన, తమిళనాడులోని అన్నాడీఎంకే, పంజాబ్ లోని ఎస్ఏడీ, యూపీలోని ఏడీఎస్, జార్ఖండ్ లోని జేఎంఎం, కర్ణాటకలోని జేడీఎస్ పాటు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపడంతో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం కానుంది.
ఇక ద్రౌపది ముర్ము విజయాన్ని దేశవ్యాప్తంగా సెలెబ్రేట్ చేసుకునేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తునట్టు తెలుస్తుంది. ద్రౌపది ముర్ము స్వస్థలంలోని ప్రజలు విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు. అలాగే ఫలితాలు ప్రకటన తరువాత దేశంలోని లక్షకు పైగా గిరిజన గ్రామాల్లో సంబరాలు నిర్వహించేలా బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా, జూలై 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY