వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో మొదలైన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్లులపై చర్చ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారని 8 మంది సభ్యులపై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ కు గురైన 8 మంది సభ్యులు రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పార్లమెంట్ ఆవరణలోనే రాత్రి పూట కూడా నిరసన కొనసాగించారు. అయితే ఈ ఎంపీలను ఈ రోజు ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పరామర్శించారు. నిరసన తెలుపుతున్న 8 మంది ఎంపీలకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తేనీరు అందించారు. ఈ సందర్భంగా ఎంపీలతో మాట్లాడారు. ఎంపీలు బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా 24 గంటలు పాటుగా తాను కూడా నిరాహార దీక్ష చేపడుతున్నట్టు హరివంశ్ వెల్లడించారు. సభలో, బయట చోటుచేసుకున్న పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయని పేర్కొంటూ, ఒకరోజు నిరాహార దీక్షకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పూనుకున్నారు. మరోవైపు సస్పెన్షన్ కు గురైన 8 మంది ఎంపీలకు హరివంశ్ తేనీరు అందించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. హరివంశ్ ప్రవర్తన ప్రతి ప్రజాస్వామ్య ప్రేమికుడిని గర్వించేలా చేస్తుందని అన్నారు. కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా తేనీరు అందించడం హరివంశ్ గొప్ప మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. భారత ప్రజలతో కలిసి హరివంశ్ ను అభినందిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu