దేశంలో ఫిబ్రవరి నెలలో రూ.1,49,577 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2023 జనవరి, ఫిబ్రవరి ఇలా వరుసగా పన్నెండు నెలల్లో జీఎస్టీ వసూళ్ల సేకరణ రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి 2023లో నమోదైన జీఎస్టీ వసూళ్లు 2022, ఫిబ్రవరి నెల కంటే 12% ఎక్కువని తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుండి ఈ నెలలో అత్యధికంగా రూ.11,931 కోట్ల సెస్ వసూలు జరిగిందన్నారు. సాధారణంగా ఫిబ్రవరి నెల 28 రోజులలో ఉండటం వలన, రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉండగా, భారీగా వసూళ్లు నమోదవడం విశేషం.
ఫిబ్రవరిలో సీజీఎస్టీ వసూళ్లు రూ.27,662 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.34,915 కోట్లు, ఐజీఎస్టీ రూ.75,069 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.35,689 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.11,931 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.792 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.34,770 కోట్లు మరియు ఎస్జీఎస్టీకి రూ.29,054 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత 2023, ఫిబ్రవరి నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.62,432 కోట్లు మరియు ఎస్జీఎస్టీకి రూ.63,969 కోట్లుగా ఉంది.
అత్యధికంగా మహారాష్ట్రలో రూ.22,349 కోట్లు, కర్ణాటకలో రూ.10,809 కోట్లు, గుజరాత్ లో రూ.9,574 కోట్లు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు (రూ.3,157 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో (రూ.3,557 కోట్లు) 13 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2022 ఫిబ్రవరిలో రూ.4,113 కోట్లు వసూలు కాగా, 2022 ఫిబ్రవరిలో 8 శాతం పెరుగుదలతో రూ.4,424 కోట్లు వసూలు అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE