కేంద్రమంత్రి, లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన విషయాన్ని ఆయన తనయుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్విటర్ లో ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. దళితులు, అణగారిన వర్గాల తరపున పోరాటం చేస్తూ, దేశంలో కీలక దళిత నేతగా గుర్తింపు పొందారు. 1969 లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన బిహార్లోని హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యుడి గానూ సేవలనందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలలోనూ, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాలలోనూ రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్నోసార్లు కేంద్ర మంత్రి పదవులు దక్కించుకుని, కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, బీహార్ నేతలు, పలువురు ముఖ్యమంత్రులు, పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu