ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగ సంక్షోభం కారణంగా, తన రాజీనామాను గవర్నర్కు సమర్పించానని పేర్కొన్నారు. ముందుగా గత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం మార్చి 10, 2021న తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో పౌరి గర్వాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తీరత్ సింగ్ రావత్ ఎంపీగా ఎన్నికయ్యారు.
అయితే రాష్ట్రంలో శాసనమండలి కూడా లేకపోవడంతో, ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలలలోపే అనగా సెప్టెంబర్ 10 కల్లా ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగడంపై సందిగ్థత నెలకుంది. ఈ క్రమంలో గడువు ముగిసేవరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో సొంత బీజేపీ పార్టీ నేతల నుంచే తీరత్ సింగ్ రావత్ కు వ్యతిరేకత రావడంతో నాయకత్వ మార్పుపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇక వచ్చే ఏడాదిలోనే ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీరత్ సింగ్ రావత్ తో రాజీనామా చేయించి, ఎమ్మెల్యేగా ఉన్న బలమైన అభ్యర్థికి నాయకత్వ అప్పగించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేసినట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ