అందమైన ప్రదేశంగా అయినా, టూరిస్టు ప్రాంతంగా అయినా సరే కేరళను మించింది లేదంటారు అక్కడకు వెళ్లొచ్చినవాళ్లు. ఎంత చూసినా తరగని ప్రకృతి అందాలు కేరళకు మాత్రమే సొంతం అంటారు. అందుకే కేరళలోని టూరిజం శాఖకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. దీనికి తగ్గట్లుగానే అందరి అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా.. సమష్టిగా పనిచేసి ఏకంగా ప్రపంచ అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది. అక్కడి ప్రజలు, ప్రభుత్వ విధానంలో మరింత స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. కరోనాకు ముందు 2019లో కేరళ ప్రభుత్వ పర్యాటక రంగ ఆదాయం రూ.45,010.69 కోట్లు కాగా..కరోనా సమయంలో బాగా తగ్గి ఆ తర్వాత గణనీయంగా పెరుగుతోంది. 2020లో రూ.11వేలకోట్లు, 2021లో రూ.12285 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది. 2022లో రూ.35168 కోట్లుకు చేరుకుంది
తాజాగా ఇలాంటి అంశంలో కేరళ మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. జీవన గమనంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లూ, అన్నింటికన్నా అక్కడ కనిపించే మానవీయ కోణాలు, స్థానిక ప్రజల ఆర్థిక ప్రమాణాలు.. ఇలా వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న కేరళ పర్యాటక శాఖ ఆచరణీయమవుతుంది. అందుకే కేరళ రాష్ట్ర బాధ్యతాయుత టూరిజం మిషన్ ఆధ్వర్యంలో.. 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డుని కేరళ కైవసం చేసుకుంది.
భారతదేశమంతటా అంటరానితనం మాట వినిపిస్తున్నా, కనిపిస్తున్నా కూడా ఈ దురాచారం కేరళలో మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతోనే నారాయణగురు అనే ఆధ్యాత్మికవేత్త.. అక్కడ స్థానికంగా ఎన్నో సంఘ సంస్కరణల్ని తీసుకుని రావడమే కాకుండా.. విద్యా సంస్థల్ని నెలకొల్పాడు. నారాయణగురు ప్రభావంతో చైతన్యం పొందిన ఎంతోమంది నేతలు ఈ అరవై ఏళ్లలో అటు రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగా కూడా కేరళ పునర్వికాసానికి కారణంగా నిలిచారు. ఆ నేతలంతా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్టు పార్టీలలో చేరారు. అధికారంలో ఎవరున్నా సరే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం మరిచిపోలేదు. 1980 నాటికే ..అందరికీ సమాన విద్యావకాశాలను అందించి ఏకంగా 91 శాతం అక్షరాస్యతని సాధించారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా కొన్ని కారణాలతో ఆర్థికాభివృద్ధిలో మాత్రం ఆ రాష్ట్రానిది వెనకంజగానే ఉంటుంది.
చుట్టూ ఎత్తైన కొండలు..అక్కడక్కడా దట్టమైన అడవులు, మరోవైపు సముద్రం, మంచినీటి కాలువలు కేరళకు ప్రత్యేక అందాలను తీసుకువస్తాయి. అయితే వీటి మధ్య ఎక్కువగా ఖాళీ స్థలం లేకపోవడంతో.. కేరళలో భారీ పరిశ్రమల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. కేవలం సుగంధద్రవ్యాల ఎగుమతి మాత్రమే అక్కడ ప్రధాన వనరుగా మారింది. అంతేకాకుండా.. చేపలు పట్టడం, ఆ పరిశ్రమకి కావాల్సిన తాళ్లు పేనడం ఇవి మాత్రమే ప్రజల ఉపాధికి శరణ్యమయ్యాయి. దీంతోనే చదువుకున్న యువతీయువకులు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.. 1980 నుంచి కేరళలో ఉన్న ఈ పరిస్థితిని మార్చి..ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కనిపించిన ఏకైక మార్గం పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడమే. అదొక్కటే ఆ ప్రభుత్వం ముందున్న ప్రధాన అవకాశంగా మారింది.
అందుకే ఎన్నో ఏళ్ల నుంచి పర్యాటకరంగంలో అక్కడ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తూనే ఉంది. స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు పర్యాటక రంగంలో ఎన్నో ప్రయోజనాలను సమకూరుస్తుంది. దానికి తోడు ప్రకృతిని, తరాలుగా వస్తున్న వారసత్వ సంపదను పరిరక్షించడంలో కూడా సహాయపడుతుంది. దీంతోనే ఎన్నో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంటున్నారు. కేవలం పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించడంతోనే కేరళ ఆర్థికంగా పుంజుకుంటోంది.రాష్ట్ర జీడీపీలో 10 శాతం పర్యాటక రంగందే.
తాజాగా గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డును కేరళ సొంతం చేసుకుంది. ఈ అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్టనర్షిప్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం , బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ విభాగం కలిసి ఏర్పాటు చేశారు. దీనికి మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా కంపెనీలకు, పర్యాటక కార్యకలాపాలకు అనుసంధానించారు. కేవలం స్వదేశీ ఉత్పత్తులనే మార్కెటింగ్ చేశారు. దీనికి కేరళ రాష్ట్ర మిషన్ సమ్మిళిత పర్యాటక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. దాంతోనే ఇప్పుడు అత్యంత విలువైన అవార్డును సొంతం చేసుకుంది కేరళ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE