తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మొత్తం 11 లక్షల మంది రైతులనుండి 48.89 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృషి, పట్టుదల, ముందుచూపు దార్శనికత వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని అన్నారు. పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతాంగానికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. ఈ ఏడాది 2020-21 వానాకాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిందని, కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ వానాకాలంలో అత్యధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి వెల్లడించారు.
11 లక్షల మంది రైతులనుండి 48.89 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు:
గత ఏడాది వానాకాలంలో 3670 కొనుగోలు కేంద్రాల ద్వారా 47.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది వానాకాలంలో 6,506 కొనుగోలు కేంద్రాల ద్వారా 11 లక్షల మంది రైతుల నుంచి 48.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ.9,224 కోట్లు విలవ చేసే ధాన్యానికి గాను 9086 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయడం జరిగిందని చెప్పారు. మరో ఒకటి రెండు రోజుల్లో మిగితా మొత్తాన్ని కూడా జమచేస్తామన్నారు. 48.89లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 29.04లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకంకాగా, సన్నరకం 19.85 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది:
దక్కన్ పీఠభూమిలో వ్యవసాయమే సాధ్యం కాదన్న చోట సీఎం కేసీఆర్ ఏడాదిలో కోటి టన్నుల ధాన్యాన్ని పండించి చూపించారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గత ఏడాది వానాకాలం, యాసంగిలో పౌరసరఫరాల శాఖ కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఈ వానాకాలంలో సాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, వరి పంట 53లక్షల ఎకరాల్లో సాగైందన్నారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఏ సీఎం చేయని విధంగా రైతుల అభివృద్ధి సంక్షమం కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఏలాంటి ఇబ్బంది కలుగకుండా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అధికార యంత్రాంగం పకడ్బందిగా పనిచేసిందని ప్రశంసించారు. మిల్లర్ల నుంచి సిఎంఆర్ సేకరించే విషయంలో కూడా ఇదే పనితీరును కనబర్చాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ