తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చీలిక విషయంలో వామపక్ష పార్టీలు కీలకంగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్తోనే తమ పొత్తన్నాయి వామపక్షాలు. కానీ సీఎం కేసీఆర్ పొత్తుకు నో అనడంతో కాంగ్రెస్తో కలుస్తామని ప్రకటించాయి. కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వామపక్షాలకు ఆదరణ దక్కలేదు. కాంగ్రెస్తో పొత్తు కుదిరిందన్న పేరుతో సీపీఐ కొత్తగూడెం సీటుతోనే సరిపెట్టుకోగా.. సీపీఎం మాత్రం ఒంటరిగా కొన్ని చోట్ల పోటీ చేస్తోంది.
సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లకు పడాల్సిన ఓట్లలో చీలిక తప్పదనే వాదన వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా కారణం కానుందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ముఖ్యంగా ఖమ్మంలో పాలేరు, నల్లగొండలో మిర్యాలగూడ సెగ్మెంట్లలో సీపీఎం ఓట్లు చీలుస్తుందనే చర్చ నడుస్తోంది.
పాలేరు నియోజకవర్గంలో ఎప్పటినుంచో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఇక్కడ నుంచే ఆ పార్టీ నేతలు కొన్నిసార్లు అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. ఖమ్మం రూరల్ మండలంలో అయితే లెఫ్ట్ పార్టీలకు ఓటు బ్యాంకు బలంగానే ఉంది. ఇప్పుడు పాలేరులో సీపీఎం అభ్యర్ధిగా.. తమ్మినేని వీరభద్రం పోటీలో ఉన్నారు. దీంతో ఖమ్మం రూరల్ మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సీపీఎం ఓటు బ్యాంకుని ఆయన చీల్చేస్తారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమ్మినేని సాధించే ఓట్లు ఏ పార్టీ విజయానికి గండికొడతాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.
సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేస్తుండగా..అవి ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండలోనే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయగా.. సీపీఎం ఒంటరిగా 26 స్థానాల్లో పోటీ చేసింది. అయితే 91వేల ఓట్లు సాధించినా కూడా ఒక్క సీటూ గెలవలేదు. సీపీఎం భద్రాచలంలో 14, 228, వైరాలో 11,373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9,106, పాలేరులో 6,769 ఓట్లను సాధించింది. ఒకవేళ అవే ఓట్లు ఇప్పుడు పడినా సుమారు 10 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తెలంగాణలో రెండు, మూడు సీట్లు అయినా గెలచుకోవడానికి సీపీఎం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చాలా ప్రయత్నించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ హ్యాండివ్వడంతో సీపీఎం ఒంటరిపోరుకు సిద్ధపడింది. సీపీఎం ఎంత బలహీనంగా ఉన్నా, కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసంలో కనీసం మూడు వేల ఓట్లయినా పడతాయి. తాడోపేడో తేల్చుకునేలా జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలిక వల్ల తమ పార్టీ విజయావకాశాలు, ఎన్ని చోట్ల దెబ్బతింటాయో అన్న ఆందోళన ప్రధాన పార్టీ అభ్యర్థులలో కనిపిస్తోంది.
పాలేరులో తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండటం పొంగులేటిని టెన్షన్ పెడుతుంటే..మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయనకి పదకొండు వేల ఓట్లు పోలవగా.. ఈ సారి జూలకంటి ఎన్ని ఓట్లు చీలుస్తారా అన్న చర్చ జరుగుతోంది. పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు , కాంగ్రెస్ అభ్యర్దిగా నిలబడ్డ బత్తుల లక్ష్మారెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. జూలకంటి రంగారెడ్డి కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అయితే జూలకంటి రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది
అలాగే నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఎం గతంలో 8 సార్లు గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ నుంచి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ అభ్యర్ధిగా వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా 5 నుంచి 5 వేల ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల గెలుపోటములకు సీపీఎం అభ్యర్థి చినవెంకులు చీల్చే ఓట్లే కీలకం కాబోతున్నాయి. అలాగే నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో.. సీపీఎం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో సీపీఎంలో పనిచేసిన నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరిపోయినా, సీపీఎంకి పడే ఓట్లు మాత్రం కీలకంగానే మారే ఛాన్సుంది.
ఇక బీఎస్పీ సంగతి చూసుకుంటే.. తెలంగాణ ఎన్నికల్లో 107 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది. సిర్పూరులో నిలబడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో నిర్మల్లో బీఎస్పీ అభ్యర్ధిగా ఇంద్రకరణ్రెడ్డి, సిర్పూరులో బీఎస్పీ అభ్యర్ధిగా నిలబడ్డ కోనేరు కోనప్ప గెలిచాక మాత్రం గులాబీ గూటికి చేరిపోయారు. అయితే తెలంగాణలో భారీగా ఉన్న దళిత బహుజనుల ఓట్లపైనే ప్రవీణ్ కుమార్ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు బీఎస్పీ ఓట్లు కూడా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చే అవకాశం ఉండటంతో..అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
అటు కొత్తగూడెం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్ధిగా జలగం వెంకట్రావు బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్,సీపీఐల ఉమ్మడి అభ్యర్తిగా కూనంనేని నిలబడగా.. బీఆర్ఎస్ అభ్యర్ధిగా వనమా వెంకటేశ్వర్రావు పోటీలో ఉన్నారు. జలగం వెంకట్రావు వల్ల.. అక్కడ ట్రయాంగిల్ వార్లో ఎవరి ఓట్లు ఎటు చీలతాయో అన్న పరిస్థితి ఉంది. మొత్తంగా పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల చీలిక అంశం ప్రధాన పార్టీలలో గుబులును పెంచుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY