తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు శుక్రవారం నాడు హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. తెలంగాణలోని దాదాపు 400 మంది వివిధ విభాగాలకు చెందిన న్యాయాధికారులతో ఈ సదస్సు మొదటిసారి జరుగుతుంది. శుక్ర, శనివారాలు, రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జీ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్ సభా వేదికను అలంకరించారు.
ఈ సదస్సులో రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్ డేట్ కావడం, తదితర మౌలిక వసతులను మెరుగుపరచడం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించే చర్యలతో పాటు న్యాయ వ్యవస్థలో పని చేస్తున్న వారి సంక్షేమానికి తగు చర్యలు చేపట్టడం అనే అంశాలపై చర్చించనున్నారు.
దేశానికి ఒక ఆదర్శవంతమైన న్యాయశాఖగా తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ పేరు గడించాలి:
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎనిమిదేండ్ల క్రితం రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా పురోగమిస్తూ, ఉన్నతస్థాయి శిఖరాలను చేరుకుంటున్నదని చెప్పారు. పటిష్టమైనటువంటి పద్ధతులు ఫిస్కల్ ప్రుడెన్స్(ఆర్థిక జాగురూకత), హార్డ్ డిసిప్లేన్ (కఠిన క్రమశిక్షణ) అమలు చేయడం ద్వారా ఈ పురోగతి సాధ్యమైందన్నారు. “రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు వెలువరించిన లెక్కల ప్రకారం 2014-15 లో 1.24 లక్షలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2.78 లక్షలకు చేరుకుంది. విద్యుచ్ఛక్తి రంగంలో సాధించిన పురోగతితో నాటి బాధలు నేడు లేవు. వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సమాచార సాంకేతిక రంగాల్లో అద్భుతంగా ముందుకు పురోగమిస్తున్నం. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. గతంలో కంటే తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ, న్యాయ పరిపాలనా విభాగం ఇంకాచాలా గొప్పగా ముందుకు పోవాలి. ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయశాఖగా తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ పేరు గడించాలని నేను ప్రబలంగా ఆకాంక్షిస్తున్నాను. హైకోర్టు విడిపోయిన తర్వాత హైకోర్టు బెంచ్ ల సంఖ్య పెంచాలని నేను స్వయానా ప్రధానికి లెటర్ రాసిన కానీ దాన్ని పెండింగ్ లో పెట్టారు. మన తెలుగువారి ముద్దు బిడ్డ, జస్టిస్ ఎన్వీ రమణ భారత న్యాయ ఉన్నత శిఖర పదవిని అధిరోహించిన తర్వాత వారు చొరవ తీసుకొని ప్రధానమంత్రిగారితో, కేంద్రప్రభుత్వంతో మాట్లాడి మన హైకోర్టులో 24 నుండి 42కు మన బెంచ్ ల సంఖ్యను పెంపొందింపచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, ప్రభుత్వం పక్షాన వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక న్యాయపరిపాలన విభాగంకై మంజూరు చేసిన మొత్తం పోస్టుల సంఖ్య 4348:
“రాష్ట్ర న్యాయశాఖకు గతంలో 780 పై చిలుకు పోస్టులను మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్య హైకోర్టు కోసం బెంచ్ ల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా కరస్పాండింగ్ సిబ్బంది, స్టాఫ్ అందరు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టీ, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ కోరారు. ఈ సందర్భంగా మరో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు మంజూరు చేసినం. ఈ జీవో కూడా విడుదల చేసి చీఫ్ జస్టిస్ కు పంపించడం జరిగింది. హైకోర్టు తర్వాత ఉండేటువంటి జిల్లా కోర్టుల్లో పనిభారం బాగా ఉందని నాకు సమాచారం అందింది. తదనుగుణంగా జడ్జి పోస్టులను, మెజిస్ట్రేట్ పోస్టుల సంఖ్యను పెంచాలని చీఫ్ జస్టిస్ ను కోరుతున్నాను. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభించాలని నేను మన సీజేఐను కోరినా. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలివ్వడం జరిగింది. డిస్ట్రిక్ కోర్టుల నిర్మాణం కోసం స్థలాలు ఎంపిక చేసి అన్ని వసతులతో కూడిన భవనాల నిర్మాణం చేపడుతాం. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కోర్టుల్లో కూడా సిబ్బంది కావాలనే కోరిక మేరకు 1730 అదనపు పోస్టులను కూడా మంజూరు చేస్తున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను. హైకోర్టుల, డిస్ట్రిక్ట్ కోర్టు, మెజిస్టేట్ కోర్టుల్లో తగిన సిబ్బందిని సమకూర్చుతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన న్యాయపరిపాలన విభాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టుల సంఖ్య 4348. న్యాయశాఖకు మరింతగా సంపూర్ణ సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది” అని సీఎం కేసీఆర్ చెప్పారు.
42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్స్ నిర్మాణం:
“డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ లో భాగంగా 1 కోటి 52 లక్షల ఎకరాల భూముల రికార్డులు డిజిటలైజ్ చేయడం జరిగింది. కోర్టులపై ఉన్నటువంటి అపారమైన విశ్వాసంతోని నమ్మకం తోని రెవెన్యూ కోర్టులను రద్దు చేసి, లిటిగేషన్లను తెలంగాణ జస్టిస్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయడం జరిగింది. 30-40 ఎకరాల స్థలంలో 42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్స్ నిర్మించబోతున్నామని సుప్రీంకోర్టు సీజేఐ కు తెలియజేస్తున్నాను. ఈ క్వార్టర్స్ శంఖుస్థాపన చేయడానికి ఆయన్ను త్వరలో సాదరంగా ఆహ్వానిస్తాం. సీజేఐ జస్టిస్ రమణ చొరవతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ప్రారంభించుకున్నాం. కార్యకలాపాలు ప్రారంభమైనవి. వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా నడుస్తున్నది. అంతర్జాతీయ వర్తక, వ్యాపార, వాణిజ్య ‘డిస్పోజల్’ లో స్పీడు పెరిగినట్లయితే మనం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టీ న్యాయమూర్తులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ ‘జ్యుడీషియల్ ఆఫీసర్స్ కన్వెన్షన్’ లో న్యాయవ్యవస్థకు సంబంధించిన 400 మంది అధికారులు కొలువుదీరిన ఈ కార్యక్రమంలో ఫలవంతమైన చర్చలు జరగాలని నేను కోరుతున్నాను” అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం’ వారి వెబ్ సైట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సమావేశంలో ప్రత్యేకతలు:
————————————-
• సీఎం కేసీఆర్ తెలుగులోనే ప్రసంగించారు.
• న్యాయవ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు.
• భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకంతో సహా తాము అడిగిన వసతులన్నీ తక్షణమే సమకూర్చుతున్న సీఎం కేసీఆర్ కు చీఫ్ జస్టిస్ ధన్యవాదాలు తెలిపారు.
• న్యాయ వ్యవస్థలో ఇప్పటికే 4320 ఉద్యోగాలను కల్పించడం గొప్ప విషయం.
• ‘చేతికి ఎముకలేదు’ అనే తెలుగు సామెతకు సీఎం కేసీఆర్ ట్రేడ్ మార్క్ గా నిలిచారని ఎన్వీ రమణ ప్రశంసల జల్లు కురిపించడంతో సభికులు చప్పట్లతో హర్షధ్వానాలు ప్రకటించారు.
• తాను కలలుకన్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటును అడగ్గానే ఒప్పుకుని దాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
• సీఎం కేసీఆర్ చేయి మంచిది కాబట్టి ఈ సెంటర్ ఇంత త్వరగా అభివృద్ధి చెందిందన్నారు.
• ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి చెప్పినట్టు అందరికీ వీణలు బహుకరించిన సీఎం నాకు మాత్రం నెమలిని బహుకరించారు. బహుశా అది జాతీయ పక్షి కావడం చేతకావచ్చు’’ అంటూ చీఫ్ జస్టిస్ చేసిన ప్రకటనతో సమావేశమందిరంలో నవ్వులు విరిశాయి.
• ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ సహా పలువురు న్యాయమూర్తులు సీఎం కేసీఆర్ ను ఘనంగా సత్కరించారు.
• సదస్సుకు హాజరైన వారందరూ సీఎం కేసీఆర్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ