తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమకు వ్యతిరేకత ఉన్న ప్రాంతాలతో పాటు.. ఏయే నియోజకవర్గాల్లో అయితే టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ తమ ప్రత్యర్థి పార్టీల నేతలకు గులాబీ కండువా కప్పి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు.. ఫలానా లీడర్కు ఆ ప్రాంతంలో పట్టుందనో.. లేక అతని వల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపడుతుందని లెక్కలున్నాయో.. వెంటనే గులాబీ బాస్ కొత్త కాలిక్యులేషన్స్ మొదలెట్టేస్తున్నారు. పార్టీ గెలుపులో ఆ నేత అవసరం ఉంటుందనుకుంటే.. కచ్చితంగా అతనికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడమైనా.. పదవి ఇవ్వడమో చేసి రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు.
దానికి నిదర్శనమే.. ఈ మధ్య కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన కొంతమంది నేతలకు.. వారు కూడా ఏమాత్రం ఊహించని విధంగా తగిన ప్రాధాన్యత ఇవ్వడం. అంతేకాదు.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. రీసెంట్గా కారెక్కిన నుంచి తెల్లం వెంకట్రావుకు కేవలం మూడంటే మూడ్రోజులకే భద్రాచలం టికెట్ను కేటాయించారు. అంతేకాదు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేని నేతలకు కూడా ఏదో ఒక పదవి కట్టబెడుతున్నారు కేసీఆర్.
ఇదే లిస్టులో ఇప్పుడు జహీరాబాద్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏర్పుల నరోత్తమ్ పేరు వినిపిస్తోంది. జులై 6 న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నరోత్తంకు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. నరోత్తమ్తో రాబోయే ఎన్నికల్లో అవసరం ఉందని ఇప్పటికే రిపోర్టులు రాగా..నరోత్తంను దగ్గర చేసుకుని ఎస్సీ సామాజిక వర్గానికి మరింత దగ్గర కావడానికి ఇదే అవకాశంగా భావించారు. దీంతో ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నరోత్తమ్ను నియమించారు గులాబీ బాస్.
సీఎం నిర్ణయంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్వర్వులను కేసీఆర్ ఆదేశాలతో సెప్టెంబర్ 8 న మంత్రి హరీశ్ రావు.. నరోత్తమ్కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కారెక్కిన అతి కొద్దిరోజుల్లోనే నరోత్తమ్కు మంచి పదవి దక్కిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఇంత సడన్గా తెరకెక్కిన నరోత్తమ్ ఎవరంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ నరోత్తమ్ ఎవరంటే.. ఈయన జహీరాబాద్కు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఏపీలో నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పని చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో నరోత్తమ్ పాత్ర కీలకమని చెబుతారు. దీంతోనే నరోత్తం సేవలను గుర్తించిన అప్పటి ప్రభుత్వం.. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగానూ.. ఆ తర్వాత వికారాబాద్లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జిగానూ బాధ్యతలు అప్పగించింది.
కానీ రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉన్న నరోత్తమ్.. ప్రజా సేవ చేస్తానంటూ 2008లో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. అయితే 2009, 2014 ఎలక్షన్స్లో రెండుసార్లు టీడీపీ తరఫున పోటీ చేసినా ఎందుకో నరోత్తమ్కు కలిసి రాలేదు. దీంతో సైకిల్ దిగిన నరోత్తం 2019లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది జులై 6న బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
రాజకీయాల్లో కావాల్సినంత సీనియారిటీ, కొన్ని గవర్నమెంట్ శాఖల్లో పనిచేసిన అనుభవంతో పాటు ముఖ్యంగా అతని సామాజిక వర్గం అతనికి కలిసిరావడంతో కేసీఆర్.. మంచి పదవిని కట్టబెట్టారంటూ సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు దీనిపై పార్టీ జెండాలు మోసేవారిని కేసీఆర్ పక్కన పెడుతున్నారంటూ పార్టీని నమ్ముకుని ఉంటున్న కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE