టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం టిఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. రాష్ట్రప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను, అసత్య ప్రచారాలను నేతలు గట్టిగా తిప్పికొట్టాలని చెప్పారు. నగరంలో వరద బాధితులకు అందిస్తున్న సాయాన్ని కూడా నిలిపేసేలా ఆ పార్టీ వ్యవహరించిందని సీఎం విమర్శించారు.
వరద నష్టానికి కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా, రాష్ట్రప్రభుత్వం సాయం చేస్తుంటే అడ్డుపడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డిసెంబర్ నెల రెండోవారంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయస్థాయి నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పశ్చిమ్బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డిఎంకె అధినేత స్టాలిన్, జేడీఎస్ నేత కుమారస్వామి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ సహా పలువురితో ఇప్పటికే మాట్లాడానని, ఈ సదస్సుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ