జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. అంబర్పేట, బార్కాస్, పురానాపూల్, సీతాఫల్మండి లాలాపేట, శ్రీరాంనగర్, జంగంపేట, పానీపురా వంటి 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో కొత్తగా డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరాంనగర్ లో డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, కొత్తగా ఎక్స్-రే, ఇసిజి, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, సిటి స్కాన్లు వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ఈ డయాగ్నొస్టిక్స్ మినీ హబ్ లను నెలకొల్పామని అన్నారు. వీటిల్లో మొత్తం 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. త్వరలోనే ఇలాంటి డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ లు హైదరాబాద్లో మరో 15 రాబోతున్నాయని, ఆ తరువాత అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
అలాగే లాలాపేటలో కొత్తగా ఏర్పాటుచేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. పేద ప్రజలకు రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకే ఈ డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ