రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు వివిధ శాఖలలోని ఖాళీల వివరాలను సేకరించుటకు సీఎస్ సోమేశ్ కుమార్ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మరియు కార్యదర్శులతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, 50 వేల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా అన్ని శాఖలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలన్నారు. అధికారులు ఖాళీల వివరాలను నిర్ణీత ప్రోఫార్మాలో సమర్పించాలని ఆదేశించారు. ఈ వివరాలను క్రోడీకరించి సీఎంకు సమర్పించవలసి ఉన్నదన్నారు. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైన మార్పులు మరియు సంస్కరణలను తీసుకురావడం ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎస్ తెలిపారు. వివిధ శాఖలలోని ఖాళీలను భర్తీ చేయడానికి సరైన మెకానిజాన్ని అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రా రామచంద్రన్, శాంతి కుమారి, రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్, జయేష్ రంజన్, రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ