తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. ఇక త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే ఇదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. ప్రస్తుతం ఆ ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టబద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
అయితే గతంలో జరిగిన పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొంది ఇన్నిరోజులు పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టబద్రుల స్థానం ఖాళీ అయింది.
ఈక్రమంలో ఖాళీ అయిన స్థానానికి త్వరలో మళ్లీ ఎన్నిక జరగనుంది. అయితే ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని అటు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటు అధికార కాంగ్రెస్ కూడా ఆ స్థానంపై కన్నేసింది. ఎట్టి పరిస్థితిలోనైనా తమకే దక్కాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈసారి ఆ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలుపొందడం కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మూడు జిల్లాల్లో రెండు జిల్లాల్లో కాంగ్రెస్కే ఎక్కువ బలం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ తప్పించి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పూర్తి స్థానాలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పది స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది.
ఇకపోతే ఆ స్థానానికి 8 జూన్ 2024లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈక్రమంలో ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చకచకా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ఈసీ మొదలు పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 1ని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 30న (ఈరోజే) ఓటర్ల జాబితాకు ఈసీ నోటీసు జారీ చేయనుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 వరకు ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 21న ఓటర్ల జాబితాను రూపొందించి.. 24న ప్రకటించనుంది. ఆ తర్వాత ఆ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించనున్నారు. చివరికి ఏప్రిల్ 4న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ