తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలను, మేథావులను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల కిందట కేసీఆర్, ఉండవల్లికి ఫోన్ చేసి హైదరాబాద్కు వచ్చినప్పుడు తనను కలవాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్ వెళ్లిన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో వారిరువురూ ప్రస్తుత దేశ రాజకీయాలపై ప్రధానంగా చర్చించినట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలియజేశాయి.
ఈ సందర్భంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని ఉండవల్లితో పంచుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రస్తుత పరిణామాలపై ఉండవల్లి అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలలో అడుగు పెట్టడమే కాకుండా బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడానికి తను ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారో ఉండవల్లికి వివరించారు. అలాగే రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో జాతీయ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని, కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఉండవల్లికి చెప్పారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ