వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు అనంతరం వారాహి వాహనం పైనుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మ నిచ్చారు. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు హవోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. కానీ నన్ను అంజన్న, ఈ నేల తల్లి కాపాడారు. అందుకే ఏ ముఖ్య కార్యక్రమం ప్రారంభించినా కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. నరసింహ స్వామిగా, ఆంజనేయస్వామిగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకం. జనసేన పార్టీ సామాన్యుడి కోసం పని చేసే పార్టీ. తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాడుతుంది” అని అన్నారు.
ఎల్లవేళలా అభయమిచ్చే శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం చేసి, వాహనాన్ని లాంఛనంగాప్రారంభించారు. ముందుగా వారాహి వాహనాన్ని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రారంభించేందుకు పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సభక్తికంగా అర్చనలు చేశారు. మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన తమలపాకులు పూజను ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ తో చేయించారు. స్వామివారికి పూలు, పళ్ళు సమర్పించిన పవన్ కళ్యాణ్ చాలాసేపు ఆలయ ఆవరణలో గడిపారు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుట సింధూరం ధరించి పూర్తి భక్తిప్రపత్తులతో పూజల్లో పాల్గొన్నారు.
స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వాహన ప్రారంభ పూజలు జరిపిన వేద పండితులు వారాహి వాహనానికి శుభం కలిగేలా గుమ్మడికాయ కొట్టి హారతి అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో పండితులు సంకల్ప సిద్ధి చేయించారు. తిరుగులేకుండా విజయాన్ని మోసుకు వస్తుందని అభిలషించారు. అనంతరం వారాహి పరిశీలించిన పవన్ కళ్యాణ్ పవనసుతుడు శ్రీ ఆంజనేయ స్వామి సాక్షిగా ఆలయం ముందే మొదటి ప్రసంగం చేసి, లాంఛనంగా వారాహి ప్రారంభించారు. కొండగట్టు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రాంత జన సైనికులు అపురూప స్వాగతం లభించింది. అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన జనసైనికులు, గజ మాలలు వేసి అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేమూరి శంకర్ గౌడ్, బి.మహేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం, తంగెళ్ళ ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE