రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతో పాటుగా 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు, 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టడానికి రూ.203 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వెంటనే ఆయా భవనాల నిర్మాణాలు, మరమ్మతులకు అవసరమైన టెండర్లు పూర్తి చేసి, ఈ డిసెంబర్ కల్లా ఆయా పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచన మేరకు నిర్ణీత సమయంలో ఆయా పనులు పూర్తి కావడం కోసమే ఈ పనులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి మంగళవారం మంత్రుల నివాసంలోని తన ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఒక్కో కొత్త భవనానికి రూ.1.5 కోట్లు, ఒక్కో సబ్ సెంటర్ నిర్మాణానికి 20 లక్షల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. అలాగే 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల్లో మిగిలిన నిధులను ఈ విధంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అయితే ఆయా పనులను అనుకున్న సమయంలో చేపట్టి, పూర్తి చేయగలిగే కాంట్రాక్టర్లకు మాత్రమే అప్పగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 9వ తేదీలోగా టెండర్లు పూర్తి చేసి, వచ్చే డిసెంబర్ లోగా నిర్మాణాలు పూర్తి అయ్యేట్లు చూడాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, పంచాయతీరాజ్ ఇఎన్సి సంజీవరావు, ఎస్ఇలు, డిఎం అండ్ హెచ్ ఓలు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY