కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో తెలంగాణ వాదనను వినిపించుకోలేదని మండిపడ్డారు. కక్ష సాధింపుల్లో భాగంగానే కేంద్ర సర్కార్.. ఏపీ విద్యుత్ డిస్కమ్లకు చెల్లించాల్సిన బకాయిలను నెల రోజుల్లోగా చెల్లించాలని కేంద్రం తెలంగాణ డిస్కమ్లకు ఆదేశాలు జారీ చేసిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు ఏర్పడాలని కేంద్రం కుట్రలు చేస్తోందని, త్వరలోనే సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల మధ్య ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వనరులను సరైన రీతిలో వినియోగించుకుంటే దేశంలోని మొత్తం రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందించవచ్చని సీఎం కేసీఆర్ చెప్పడం కేంద్రంలోని బీజేపీకి నచ్చడం లేదని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బిల్లులు రూ. 12,941 కోట్లు ఉన్నాయని, ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసనీ చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ