తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల పై ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని అన్నారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రి కేటిఆర్ అన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు.
సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు, జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం అధికారులు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌళిక వసతుల పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నవని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుసగా పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటవెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు. సుమారు 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు మరో పది వేలు జెఎన్ఎన్ యుఆర్ఎం మరియు వాంబే ఇళ్లు ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు.
ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున 24 నియోజకవర్గాలకు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం ఉండబోతుందన్నారు. దీనికి సంబంధించిన లబ్దిదారుల క్యాచ్మెంట్ ఏరియా కూడా రూపొందించినట్లు మంత్రి కేటిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఇచ్చినటువంటి మురికివాడల్లోని ప్రజల జాబితాను వెంటనే అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిసర జిల్లాలో నిర్మిస్తున్న ప్రాంతాల్లో సుమారు 10% స్థానిక ప్రజల కోసం కేటాయించిన నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో సింహభాగాన్ని ఈ సంవత్సరం చివరి వరకు ప్రజలకు అందిస్తామని మంత్రి కేటిఆర్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu