హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా నగరం కోసం ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మించే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కేశవాపురం ప్రాజెక్టు తాలూకు ప్రణాళికలు వేగంగా ముందుకు పోతున్నాయని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన సుమారు 1490 ఎకరాల భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంగళవారం నాడు హైదరాబాద్ జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేశవాపురం ప్రాజెక్టు పనులకు సంబంధించిన పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు.
కేశవాపురం రిజర్వాయర్ కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అటవీశాఖ అనుమతులకు సంబంధించి మరింత వేగంగా ముందుకు పోవాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని మంత్రి కేటిఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా నీటి కొరత లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కేశవాపురం రిజర్వాయర్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నదని, వీటికి సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఆ దిశగా జలమండలి అధికారులు పనిచేయాలన్నారు.
నగరంలో పెద్దఎత్తున మరిన్ని ఎస్టీపీల నిర్మాణం:
ఇప్పటికే మురికి నీటి శుద్దీకరణలో దేశంలోని అన్ని నగరాల కన్నాఅగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో మురికి నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు పలు కార్యక్రమాలకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఈరోజు జలమండలి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటిఆర్ ఇందుకు సంబంధించి పలు సూచనలను చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 770 ఎంఎల్ డి ల మురికినీటి శుద్ధీకరణ కొనసాగుతున్నదని, ఇది దేశంలోని అన్ని నగరాల్లో కన్నా అత్యధికమని కేటిఆర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్టీపీలకి అదనంగా మరో పన్నెండు వందల ఎంఎల్ డి ల ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఎస్టీపీ లను మూసి నదికి అనుసంధానం చేస్తూ మూసి శుద్ధీకరణకు సంబంధించి తగురీతిన ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మాస్టర్ సివరేజ్ ప్లాన్ ఆధారంగా ఎస్టీపీల నిర్మాణానికి అవసరమైన అన్ని వివరాలతో కూడిన ఒక నివేదికను వారం రోజుల లోపల ప్రభుత్వానికి సమర్పించాలని జలమండలి అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu