హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయంలో నూతనంగా రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 80 సీట్ల సామర్ధ్యం గల ఎలక్ట్రికల్ క్రూజ్ లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం నాడు హుస్సేన్ సాగర్ జలాశయం లోని బోటింగ్ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో కొత్తగా రూపొందిస్తున్న క్రూజ్ బోట్ ల నిర్మాణ పనులు పరిశీలించారు. రెండస్తుల బోట్ అంతా కలియ తిరిగి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ అనగానే హుస్సేన్ సాగర్, బుద్దుని విగ్రహం సింబాలిక్ గా నిలిచిందన్నారు. కొత్తగా ఎలక్ట్రానిక్ క్రుజర్, బోట్ లను పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలోనే మొదటి సారిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామన్నారు. ఇందులో బర్త్ డే, ఇతర వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. దుర్గం చెరువులో కూడా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెండు బోట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కూడా టూరిజం స్పాట్ గా అవతరిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విదేశీ టూరిస్ట్ ల సంఖ్య పెరుగుతోందన్నారు. కరోనా నేపథ్యంలో కొంత తగ్గిన మళ్ళీ పుంజుకుందన్నారు. యాదాద్రి ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే అక్కడ విదేశీ టూరిస్ట్ లను ఆకట్టుకునేందుకు మరింత అద్భుతమైన టూరిజం స్పాట్ ఏర్పాటు కాబోతుందన్నారు. అలాగే రానున్న కొద్దిరోజుల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్, ఎలక్ట్రిక్ బోట్ లను అందుబాటులోకి తెస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మనకు సముద్రంలా నీళ్లు ఉన్నాయి. వాటిలో కూడా టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎండీ మనోహర్ రావు, ఈడీ శంకర్ రెడ్డి, జీఎం ఇబ్రహీం, పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ