వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. గతంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలో చేసిన స్వీయ తప్పిదాలతో అధికారం కోల్పోయిన ఆ పార్టీకి తిరిగి జవజీవాలు నింపేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్వయంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల పర్యటిస్తూ విభిన్న వర్గాలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు రాహుల్ బాటలోనే సాధారణ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీని కాస్తా కర్నాటక విజయం తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మార్చేసుకున్న ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు స్థానికంగానూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇందులో భాగంగా తెలంగాణలోని ఓ జాతీయ రహదారి పక్కన తాజాగా ఓ టీ స్టాల్ ఏర్పాటు చేశారు. అంతే కాదు టీని, రాహుల్ గాంధీని కలుపుతూ ఓ స్లోగన్ కూడా తయారు చేసేశారు. టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుందని, రాహుల్ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్ అవుతుందంటూ ఓ నినాదం తయారు చేసి పెట్టారు. అంతే కాదు ఈ టీ స్టాల్కి రాహుల్ గాంధీ పేరు పెట్టేశారు. దీంతో ఇప్పుడు ఈ టీ స్టాల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఈ ఫొటోను ట్వీట్ చేశారు.
గతంలో పలు టీ స్టాళ్లలో కూర్చుని అక్కడ స్థానికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. గతంలో తాను ఛాయ్ వాలాగా చెప్పుకుంటున్న ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ టీ కొట్టు నడిపే వారి కష్టాల్ని హైలెట్ చేశారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ పేరుతోనే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కొందరు ఈ స్టాల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారన్నది మాత్రం తెలియ రాలేదు. టీ స్టాల్ బోర్డుపై రాసిన అక్షరాల్ని బట్టి ఇది తెలంగాణ ప్రాంతంలోనే ఏర్పాటైనట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE