రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ను ఇప్పటి వరకు 5.84 లక్షల మంది తిలకించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేశారు. 2622 రిజిస్ట్రేషన్ లు పూర్తి కాగా, రూ.7.77 కోట్లు చెల్లించారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 5971 స్లాట్ బుకింగులు జరుగగా 6239 మంది డబ్బులు చెల్లించారని పేర్కొన్నారు. గురువారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఏర్పాటు చేయబడిన ధరణి కంట్రోల్ రూం ను ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ సందర్శించారు.
ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉంది:
ధరణి కంట్రోల్ రూంలో 100 మంది సభ్యుల బృందం ధరణి పోర్టల్ లో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ , స్టాంపులు మరియు రిజిష్ట్రేషన్ ల శాఖ, ఐ.జి. శేషాద్రి, ఇతర అధికారులు ధరణి పోర్టల్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పరిశీలన సందర్భంగా సీఎస్ పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణీ పోర్టల్ ను సమర్థవంతంగా, పారదర్శకంగా , సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విచక్షణకు తావు లేకుండా పని చేయాలని ఆయన సూచించారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. ఏ రోజుకు బుక్ అయిన స్లాట్ లలో అదే రోజు రిజిస్టేషన్స్/ మ్యుటేషన్స్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ