రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ మూడు రోజులపాటు (సెప్టెంబర్ 16, 17, 18, 2022 తేదీల్లో) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16, శుక్రవారం రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అత్యంత ఉత్సాహంగా జాతీయ సమైక్యతా ర్యాలీలు జరిగాయి. ఆయా నియోజక వర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాతీయ పతాకాలను ధరించి కొనసాగిన ఈ ర్యాలీలు ఆయా ప్రాంతాల్లో కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం ఆయా నియోజక కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించి, భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం కలయికకు దారితీసిన పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సంబంధిత ప్రజాప్రతినిధులు వివరించారు. అలాగే ఈ సందర్భంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్:
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు సందర్బంగా ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ ర్యాలీ అనంతరం పీపుల్స్ ప్లాజాలో జరిగిన బహిరంగ సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17నే వచ్చిందని, అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయానికి భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, ‘సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన రోజు. అంతకు ముందు నిజాం ప్రభుత్వం ఉండేది. మిగతా ప్రాంతాల్లోగా మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు. పెద్ద ఉద్యమం, చాలామంది ప్రాణాలు కోల్పోయాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజు భారతదేశంలో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు లేఖ రాశారు. ఖాసీం రజ్వీ లాంటి వాళ్ళు వ్యతిరేకించినా ఆయనను జైల్లో పెట్టి స్వాతంత్య్రం ఇచ్చారు. దేశానికి గాంధీ ఎలాగో తెలంగాణకు గాంధీ సీఎం కేసీఆర్. దేశానికి తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం” అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, “తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతున్నాం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో 15 వేల మంది ర్యాలీలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 17 అందరికీ అవగాహన కలగాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తోంది’ అని తెలిపారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో సీఎం కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరైన వారితో కలసి సామూహిక బోజనాలను చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY