హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరిస్తూ, దాంతో పాటుగా ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ లలో మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ లలో నిర్మించే ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.2,679 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పరిపాలనపరమైన అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆసుపత్రుల నిర్మాణం కోసం డిజైన్-బిల్డ్ మోడ్ లో బిడ్స్ ఆహ్వానించేందుకు ఆర్ అండ్ బీ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా స్వయంప్రతిపత్త సంస్థలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులు కేటాయింపు:
- టిమ్స్ ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా: రూ.900 కోట్లు
- టిమ్స్ అల్వాల్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: రూ.897 కోట్లు
- టిమ్స్ సనత్నగర్, హైదరాబాద్ జిల్లా: రూ.882 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ