ఇండియాలో కరోనా వైరస్ మళ్ళీ పంజా విసురుతోంది. తగ్గినట్లే కనిపించిన కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గతకొద్ది రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించిన కొత్త సబ్ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఢిల్లీలో కరోనా బారినపడిన రోగుల శాంపిల్స్ పరీక్షించగా అందులో మరో ఒమిక్రాన్ కొత్త BA.2. 12.1 సబ్ వేరియంట్ వెలుగుచూసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏజెన్సీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్, ఢిల్లీలో వేరియంట్ను గుర్తించినట్లు ధృవీకరించారు. అయితే, గత కొన్ని రోజులుగా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్కు గురైన ఢిల్లీ నుండి సేకరించిన అనేక నమూనాలలో BA.2.12.1 వేరియంట్ కనుగొనబడిందని చెప్పారు.
ఈ కొత్త మ్యుటెంట్ BA. 2.12.1 ఒమిక్రాన్ సబ్వేరియంట్ BA.2కి సంబంధించినది. కానీ ఇది దానికన్నా విభిన్నమైన మార్పులతో కనిపిస్తోందని, ఢిల్లీ మరియు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రస్తుత కోవిడ్-19 కేసుల పెరుగుదలకు దారితీస్తోందని భారతదేశపు కరోనా వైరస్ జెనోమిక్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ ప్రతినిధులు వెల్లడించారు. కాగా ఈ ఉత్పరివర్తన అమెరికాలో కూడా గుర్తించబడింది. అయితే ఒమిక్రాన్ BA.2 కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త సబ్ వేరియంట్, BA.2 కంటే ప్రమాదకరంగా కనిపిస్తుందని, ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందగల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయ్యే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ మ్యుటెంట్ ఎపిడెమియోలాజికల్ డేటాను విశ్లేషించే పనిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ