పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఏ రాజకీయ నాయకుడిని చూసినా.. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటూ మరోవైపు రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ డిసెంబర్ 3న తామే తెలంగాణలో విజయఢంకా మోగిస్తామంటూ ప్రత్యర్ధి పార్టీలకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో నేతల సవాళ్లతో తెలంగాణ గడ్డ వేడెక్కిపోతోంది. అందులో ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోన్న ఎన్నికల పోరులో ఈసారి ఎవరు పాగా పాతుతారన్న ప్రశ్న వినిపిస్తోంది.
దుబ్బాక నియోజకవర్గం అంటేనే తెలంగాణలో బీజేపీకి ఊపిరిపోసిన గడ్డగా చెప్పుకుంటారు. గతంలో కాంగ్రెస్ను గుండెల్లో పెట్టుకున్న ఇక్కడి ప్రజలు.. ఇప్పుడు ఎవరి వైపు ఉంటారా అన్న ఆసక్తిని రేపుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలలో బరిలో దిగినవాళ్లలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా మరొకరు సిట్టింగ్ ఎంపీ అలాగే ఇంకొకరు ప్రజా నాయకుడి తనయుడు ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారంతో దుబ్బాక రాజకీయం వేడెక్కింది.
దుబ్బాకలో మళ్లీ బై ఎలక్షన్ రిజల్ట్నే రిపీట్ చేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కాన్ఫిడెంట్తో ఉన్నారు.అలాగే చెరుకు ముత్యం రెడ్డి తనయుడు .. చెరుకు శ్రీనావాస్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్జిగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సంక్షేమమే సక్సెస్ మంత్ర అంటూ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సైలెంట్గా జనంలో మమేకమవుతున్నారు. దీంతో ఈ ముగ్గురిలో దుబ్బాక ప్రజలు ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది.
మొదటి నుంచి దుబ్బాకలో మళ్లీ కమలం జెండాను ఎగరేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్రావు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే అన్ని ఊర్లు తిరిగేశానని.. దుబ్బాకలోని ప్రతి పల్లె తమ పార్టీ వైపు చూస్తుందని అంటున్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని.. తాను కొట్లాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానని చెబుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను గద్దె దింపడానికి దుబ్బాక ప్రజలు సిద్ధంగా ఉన్నారని రఘునందన్రావు అంటున్నారు.
అలాగే అభివృద్ధే ప్రచార అస్త్రంగా.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా.. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తమ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదే విజయ మంత్రాన్ని దుబ్బాక జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్న ఆయన.. . సొంత గడ్డ దుబ్బాకను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు.. ప్రతి మడికి నీళ్లు అందిస్తామని హామీ ఇస్తున్నారు. కత్తి దాడి తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డికి డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పినా సరే.. పోలింగ్కు సమయం దగ్గర పడటంతో.. నియోజకవర్గ ప్రజల్ని కలుస్తూ, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
మరోవైపు తెలంగాణ ఆకాంక్షను కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి ఆరోపిస్తూనే ఆ దిశగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని చెబుతున్న ఆయన.. మల్లన్నసాగర్ బాధితులను తాము కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. అంతేకాదు మంత్రిగా తన తండ్రి చేసిన అభివృద్ధి పనులన్నిటినీ.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ పార్టీ 32వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బాకలో పోటీ పడుతున్న మూడు పార్టీల అభ్యర్థులు కూడా రాజకీయంగా బలమైన వారే కావడంతో.. అందరి చూపు ఇప్పుడు ఆ నియోజకవర్గం వైపే పడింది. దీంతో ఈ త్రిముఖ పోటీలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేదెవరనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారంటూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE