తెలంగాణలో పాలమూరు నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. అంతెందుకు ఇక్కడి ఓటర్లకు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగానే ఉంటుంది.అందుకే పాలమూరు ఓటర్లు జ్ఞానంతో ఓటేసే మేధావులవన్న పేరు బడ్డారు. ఏ ఎన్నికలలో ఎవరిని గెలిపిస్తారో? ఎవరిని ఓడిస్తారో రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేరు.
పాలమూరు నియోజకవర్గంలో బీసీలు, ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నా కూడా ఇప్పటి వరకూ ఓటర్లు బీసీలకే మొగ్గు చూపారు. అయితే ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో..వీరి ఓట్లు ఎవరికి అనేది అంతు బట్టడం లేదు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా గౌడ బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్గౌడ్ .. ఇప్పటికే రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అయిన యన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా .. బీజేపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బరిలో దిగారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా రాజకీయ ఉద్దండులే కావడంతో గెలుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సామాజిక వర్గంగా చూస్తే.. 1952 వ సంవత్సరం నుంచి 2023 వ సంవత్సరం వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎనిమిదిసార్లు బీసీలకే పట్టం కట్టారు. రెండు సార్లు మాత్రం ముస్లింలకు, ఒక్కసారి బ్రాహ్మణులకు, మూడుసార్లు రెడ్డిలకు పాలమూరు ఓటర్లు అవకాశమిచ్చారు. అలాగే పార్టీల పరంగా చూస్తే నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీకి, రెండు సార్లు తెలుగు దేశం పార్టీకి, మరో రెండు సార్లు ఇండిపెండెంట్కు , అలాగే బీజేపీకి ఒకసారి, ప్రజాపార్టీకి మరోసారి గెలిపించారు. అంతేకాదు..రెండుసార్లు స్వతంత్రులకు విజయాన్ని అందించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పాలమూరు ఓటర్లు ఎవరికి విజయాన్ని అందిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. మొదటిసారిగా 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పి.హనుమంతురావు గెలిచారు. 1957లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రజా పార్టీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన ఏగూరి చిన్నప్ప విజయం సాధించారు. అలాగే 1962, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎం.రామిరెడ్డి గెలిచారు.
1967,1972లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అన్సారి ఇబ్రహీం అలీని రెండు సార్లు గెలిపించిన పాలమూరు ఓటర్లు.. 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆంజనేయులుకు విజయాన్ని అందించారు.1983,1994లో నుంచి టీడీపీ అభ్యర్ధిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పి.చంద్ర శేఖర్ రెండు సార్లు విజయం సాధించారు. 1989,2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఒకసారి, ఇండిపెంట్గా మరోసారి పద్మశాలి బీసీ సామాజిక వర్గానికి చెందిన పులి వీరన్న గెలిచారు.
అలాగే 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్.రాజేశ్వర్రెడ్డి విజయం సాధించగా.. రాజేశ్వర్ రెడ్డి ఆయన అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా బరిలో నిలబడ్డ యన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. 2014,2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన గౌడ బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గెలిచారు. వీరిలో పి .చంద్రశేఖర్, పులి వీరన్న, శ్రీనివాస్ గౌడ్ కీలకమైన మంత్రి పదవులను కూడా చేపట్టారు.
పాలమూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఎవరు గెలవాలన్నా సరే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్లు, ఇతర బీసీలు, ముస్లీం మైనార్టీల ఓట్లే కీలకం కాబోతున్నాయి. పాలమూరు నియోజకవర్గంలో 2,12,833 మంది వరకూ ఓట్లరు ఉన్నారు. వీరిలో ముదిరాజులు, ముస్లిం మైనార్టీల ఓట్లే లక్షకు పైన ఉన్నాయి. అంటే మొత్తం ఓటర్లలో చూసుకుంటే.. 50 శాతం కేవలం ఈ రెండు సామాజిక వర్గాలదే ఉంది. అయితే బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. అంతేకాదు రెడ్లు, మున్నూరు కాపు, గౌడ్లు, రజక, వడ్డెర, బోయల ఓట్లు కూడా ఉన్నాయి. ఏది ఏమయినా పాలుమూరులో ముదిరాజ్, ముస్లీం ఓటర్లే.. అభ్యర్దుల జాతకాలు మార్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .
బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి శ్రీనివాస్గౌడ్.. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ మొదటి సారి 2014లో పోటీ చేసినప్పుడు 45,447 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి అయిన యన్నం శ్రీనివాస్రెడ్డికి 42,308 ఓట్లు వచ్చాయి. అదే విధంగా స్వతంత్ర అబ్యర్థి సయ్యద్ ఇబ్రహీంకు 27,396 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఒబేదుల్లా కొత్వాల్కు 22,744 ఓట్లు పడ్డాయి. . బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్గౌడ్ కేవలం 3,139 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు.
అలాగే రెండోసారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్గౌడ్ పోటీ చేసినప్పుడు మాత్రం.. ఎవరూ ఊహించని రీతిలో 86,474 ఓట్లు రాబట్టుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్కు 28,699 ఓట్లు రాగా.. బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన సయ్యద్ ఇబ్రహీంకు 21,664 ఓట్లు పడ్డాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి అయిన సురేంద్ర రెడ్డికి 11,633 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ 57,775 అత్యంత భారీ మెజార్టీ తో గెలిచారు.
ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం రెండు మార్పులు జరిగా యి. 2018 ఎన్నికల్లో యన్నం శ్రీని వాస్రెడ్డి పోటీ చేయక పోగా, టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రశేఖర్, బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒబేదుల్లా కొత్వాల్, బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీం ముస్లీం సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరికి కలిపి 50,140 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ముస్లిం మైనార్టీల ఓట్లు వీరికి ఎక్కువగా పడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
అలాగే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,తెలుగు దేశం పార్టీ మద్దతుతో ఉన్న ఎర్రశేఖర్కు, బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీంకు కలిపి 50,363 ఓట్లు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో ముస్లీం ఓటర్లలో చీలిక కనిపించడంతో పాటు.. ముదిరాజ్ ఓటర్లు కొంతమంది.. ఎర్ర శేఖర్కు కూడా బదిలి అయినట్లు తెలుస్తోంది. అప్పుడే శ్రీనివాస్ గౌడ్కు ఊహించని భారీ మెజార్టీ లభించింది. మరి ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్, ముస్లీం ఓట్లతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఉద్యోగుల ఓట్లు కూడా కీలకంగా కాబోతున్నాయి. దీంతో పాలమూరు ఓటర్లు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని చర్చ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE