ఏపీలో త్వరలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని నటుడు అలీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలన్న కోరిక అలీకి చాన్నాళ్ల నుంచీ ఉంది.సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అలీకి దక్కలేదు. అందుకే గత ఎన్నికల సమయంలో సైకిల్ దిగి వైసీపీ కండువా కప్పుకున్నా.. అప్పటికే వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో.. కేవలం ఆయన ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాల్సి వచ్చింది.
ముందుగా పవన్కు మంచి స్నేహితుడు కాబట్టి జనసేన పార్టీలో చేరతారని అనుకున్నా..ఫ్రెండ్షిప్ కంటే పవర్ ముఖ్యం అన్నట్లుగా జగన్ పంచన చేరారు. అలీ అంచనా వేసినట్లుగానే వైసీపీ అధికారంలోకి రావడంతో అతనికి ..ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని ఇచ్చారు సీఎం జగన్. ఆ పదవిలో కొనసాగుతున్న అలీ.. పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల వైపు అలీకి ఉన్న ఆసక్తితో ఈ ఎన్నికల్లో అలీకి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.
అలీ సొంత నియోజకవర్గమైన రాజమండ్రి కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు . రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అలీకి ఎప్పటి నుంచో కోరిక. కానీ ఇప్పుడు సామాజిక సమీకరణల్లో భాగంగా రాజమండ్రి మీద ఆశలు పెట్టుకోవద్దన్న పార్టీ వర్గాల సూచనతో అలీ పునరాలోచనలో పడ్డారు. దీంతో ఏపీ వ్యాప్తంగా తనకు అనుకూలమైన అసెంబ్లీ నియోజకవర్గాలపై ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న వాటిపై అలీ ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ వైసీపీ సీనియర్లు ఉండటంతో.. ఎక్కడైనా ఎంపీగా పోటీ చేస్తే బెటరని అలీ భావిస్తున్నారు.
ఇక ఇప్పటివరకు ఏపీ సీఎం జగన్.. 9 జాబితాలను ప్రకటించి..సుమారు 80 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చేశారు. అవి ఇంకా పూర్తవలేదని.. త్వరలో మరి కొన్ని మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో సీటు వచ్చిన వాళ్లు, సీటు మీద ఆశలు పెట్టుకున్న సిట్టింగులు కూడా టెన్షన్ టెన్షన్గానే ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అలీకి సీఎంవో నుంచి పిలుపు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్..అలీని కర్నూలు కానీ నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి కానీ పోటీ చేయమని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. పైగా అక్కడ పార్టీకి పట్టు ఉండడం, అలీ సెలబ్రిటీ కావడంతో తప్పకుండా విజయం సాధిస్తారన్న సర్వేల లెక్కలు జగన్కు అందినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ ప్రత్యేకంగా అలీని పిలిపించి ఈ విషయంపై చర్చించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే అలీ కర్నూలు కంటే నంద్యాలలో పోటీ చేయడానికే ఆస్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పదో జాబితాలో అలీ పేరు ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY