ఈరోజు ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు రోజుల్లో కమిటీ సభ్యులను ప్రకటిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనుగోలు జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెగాసస్ కొనుగోళ్ల వ్యవహారంపై చర్చించాల్సిందిగా అధికార పార్టీ స్పీకర్ తమ్మినేనిని కోరింది. దీనికి అంగీకరించిన స్పీకర్ తమ్మినేని ముందుగా నోటీసు ఇవ్వాలని సూచించారు. దీంతో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇవ్వగా, స్పీకర్ చర్చకు అనుమతిచ్చారు.
ఈ క్రమంలో చర్చలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై తమ వాదనలు వినిపించారు. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుందని, దీనిపై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు కూడా చేపట్టిందని ఆర్ధికమంత్రి బుగ్గన స్పష్టం చేశారు. చర్చ అనంతరం స్పీకర్ పెగాసస్ వ్యవహారంపై నిగ్గు తేల్చటానికి హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మరోవైపు టీడీపీ దీనిపై స్పందించింది. తమ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనుగోలుకు ప్రతిపాదన వచ్చిందని, కానీ తాము దాన్ని కొనుగోలు చేయలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తోందని, దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని నారా లోకేష్ తెలియజేశారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే చల్లరేలా లేదు. ఇది మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ