ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు–నేడుతో పాటుగా పౌండేషన్ స్కూళ్లపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, నూతన విద్యావిధానం అమలుపై అన్నిరకాలుగా సిద్ధంకావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలని, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా వేయి స్కూళ్లను సీబీఎస్ఈ అఫిలియేషన్ చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరాలు అందించగా, అన్నిరకాల స్కూళ్లు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టిపెట్టాలని చెప్పారు.
ఇక నాడు-నేడు కింద రెండో విడతలో రాష్ట్రంలో 12,663 స్కూళ్లలో రూ.4535.74 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు రూపొందించారు. రెండో దఫా నాడు-నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు. మరోవైపు జగనన్న విద్యాకానుకపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. అలాగే స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నామని, అక్టోబరు మధ్యంతరంలో ఈ కార్యక్రమం ప్రారంభానికి సన్నహాలు చేస్తున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్ కు తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పలువురు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ