ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం వేదికగా నేటినుంచి రెండు రోజుల పాటు జరుగనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల టెక్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశాలకు భారతదేశం నుంచే కాకుండా అమెరికా, లండన్ సహా 25 దేశాల నుండి 300 మంది ప్రపంచ భాగస్వాములు మరియు దాదాపు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇక సమ్మిట్ లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు ఆమె టెక్ సమ్మిట్ భారతదేశంలో జరిగే జీ20 అధ్యక్ష సమావేశం గురించి ప్రస్తావించనున్నారు.
కాగా గ్లోబల్ టెక్ సమ్మిట్ బ్రాండ్ వైజాగ్ను పెట్టుబడి గమ్యస్థానంగా ప్రమోట్ చేస్తుందని ఈ సందర్భంగా సమ్మిట్ కో-కన్వీనర్ మరియు పల్సస్ సిఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. అలాగే ఈ గ్లోబల్ టెక్ సమ్మిట్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించబడుతుందని, దేనిలో ఆరోగ్యం, సాంకేతికత, ఫైనాన్స్, ఫార్మా, సైన్స్ మరియు పరిశ్రమల రంగాలలో సాంకేతికత ఎలా ఉపయోగించబడుతుందనే దానిపై విశ్లేషణాత్మక చర్చ జరుగనుందని తెలిపారు. యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఈబీటీసీ) మరియు భారత నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్డీసీ)తో సమ్మిట్లో ఎంఒయు కుదుర్చుకోనున్నాయని ఆయన వెల్లడించారు. ఇక వైజాగ్లోని స్థానిక విశ్వవిద్యాలయం సహకారంతో వ్యవసాయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క సీఎండీ మరియు ఈబీటీసీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ కమోడోర్ అమిత్ రస్తోగి యూరోపియన్ వ్యవసాయ పద్ధతులను భారతీయ రైతులకు వివరిస్తారని ఆయన తెలిపారు. ఇక ఈ టెక్ సమ్మిట్ జీ20 దేశాలలో ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలను ప్రతి నెలా ఒక శిఖరాగ్ర సదస్సుతో ప్రారంభిస్తుందని, దీనిలో భాగంగా ప్రస్తుతం వైజాగ్లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం ఏప్రిల్లో రియాద్లో జరుగుతుందని, దాని తర్వాత టొరంటో, రోమ్, పారిస్, న్యూయార్క్, మెల్బోర్న్ మొదలైన నగరాలలో జరుగుతాయని శ్రీనుబాబు వెల్లడించారు. కాగా ఈ సదస్సును ఎన్ఆర్డీసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పల్సస్ గ్రూప్ నిర్వహిస్తోంది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని మరియు పీడిక రాజన్న దొర తదితరులు కూడా ఈ సదస్సు ప్రారంభ సెషన్లో పాల్గొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE