ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇకపై పోలీస్ శాఖలో అంతర్భాగం కానున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ, అందుకు సంబంధించిన విధివిధానాలపై ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 14,313 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండేళ్ల ప్రొబెషన్ పీరియడ్ కూడా పూర్తి కానుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరణలో భాగంగా వారిని మహిళా పోలీసులుగా పేర్కొంటూ కానిస్టేబుల్ కు ఉండే అధికారాలు, బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ముందుగా గ్రామ/వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులుకు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా కానిస్టేబుళ్లు ధరిస్తున్న యూనిఫాంను కూడా వీరికి అందించనున్నారు. వీరు విధులు నిర్వహిస్తున్న గ్రామ/వార్డు సచివాలయానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. వీరికి భవిష్యత్ లో పదోన్నతుల కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం సృష్టించనుంది. మహిళా పోలీసులుకు అధికారాలు, విధులు, ఇతర అంశాలకు సంబంధించి చట్టంలో అవసరమైన మార్పులు తీసుకురానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ