ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మంగళవారం ‘రొట్టెల పండుగ’ ఘనంగా ఆరంభమయింది. పవిత్ర ఇస్లామిక్ మాసమైన మొహర్రంలో జరుపుకునే ఈ పండుగకు స్థానిక ‘బారా షహీద్’ దర్గా వేదిక కానుంది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు 9 నుంచి 13 వరకు పూర్తిస్థాయిలో ప్రముఖ బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ షాజహాన్, ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా విస్తృత ఏర్పాట్లు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం 2015 లోనే ప్రకటించింది.
ఈ క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి తరలి రానున్న భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కుతూ ఈ దర్గాలో రొట్టెలు సమర్పించడం ఆనవాయితీ. దర్గాకు సమీపంలోని స్వర్ణాల చెరువులో భక్తులు పవిత్ర స్నానమాచరించిన తర్వాత ఒకరికొకరు రొట్టెలు మార్చుకోవడం ఇక్కడ ఒక సంప్రదాయంగా వస్తోంది. చదువు రొట్టె, ఉద్యోగ రొట్టె, ఐశ్వర్య రొట్టె, ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె అనే పలు రకాల పేర్లతో భక్తులు రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు. కాగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నది. ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈసారి రొట్టెల పండుగకు దాదాపు 15 లక్షల మంది భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY